2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము. 2-52వ శ్లోకము

 శ్లో|| యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||(2-52)|| 

టీక:- యదా = ఏదైతే; తే = నిన్ను; బుద్ధిః = బుద్ధి;మోహకలిలం = మోహమను మాలిన్యము; వ్యతితరిష్యతి = దాటగలదో; తదా = అప్పుడు;  శ్రోతవ్యస్య = వినబోయేది; శ్రుతస్య = వినినది;   చ = మరియు; నిర్వేదం = విరక్తిని; గంతాసి = పొందగలవు;   

భావము:   అర్జునా! నీబుద్ధి యెపుడు అజ్ఞానమను మాలిన్యమును దాటునో అపుడిక వినవలసినదానిని గూర్చియు, వినినదానిని గూర్చియు, నీవు వైరాగ్యమును గలిగియుందువు. 

వ్యాఖ్యానము:

శాశ్వత విమోచన​: ఈ శ్లోకములో వినినది, వినబోయేది అని చెప్పి యోగులైనవారు గతమునను, భవిష్యత్తులోను అనగా ఎప్పటికిని విముక్తి పొందుదురని భగవానుడు ఆనతిచ్చెను. 

శ్రవణానుభవాలు బలవత్తరమైనవి: వ్యక్తులు ఎదుర్కొనే సవాళ్ల నుండి ప్రాధమికంగా ఆహ్లాదకరమైన మరియు బాధాకరమైన జ్ఞాపకాలు ఉద్భవిస్తాయి. ఈ ప్రక్రియలో వినికిడి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఏదైనా విన్నప్పుడు, దానిని దృశ్యీకరించడానికి మరియు మన ప్రస్తుత జ్ఞాపకాలకు అనుసంధానించడానికి మన ఊహను నిమగ్నం చేస్తాము. దీనికి విరుద్ధంగా, మనం ఏదైనా చూసినప్పుడు, మనం ఒక నిర్దిష్ట క్షణాన్ని బంధించి నిల్వ చేస్తాము. అందువల్ల, శ్రవణ అనుభవాలు తరచుగా బలమైన జ్ఞాపకాలను సృష్టిస్తాయి. కుక్కలపై పావ్లోవ్ చేసిన ప్రయోగాల్లో వినికిడి కారణంగా బలమైన కండిషనింగ్ ఏర్పడడం మనమింతకు మునుపు చర్చించుకున్నాము. ఈ రకముగా వినికిడిని మనము ప్రాథమికముగా గమనించ వలసిన అవసరాన్ని ఈ శ్లోకము గుర్తు చేస్తుంది. కొంత రుజువు చేస్తుంది. 

శాస్త్రీయ పునాదులు, భగవద్గీత: ఈ నేపథ్యంలో భగవద్గీత కేవలం బోధనాత్మక విషయముల సమాహారం మాత్రమే కాదని, పైగా ఇది శాస్త్రీయ పునాదులతో కూడిన లోతైన మరియు పరివర్తనాత్మక గ్రంథమని తెలియవచ్చును. నిష్పాక్షిక దృక్పథంతో  అనుసరించినప్పుడు గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చును. తదుపరి శ్లోకమును కూడా చూడుము. 

x-x-x-x

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి