20, ఏప్రిల్ 2024, శనివారం

2-4, 5: సాంఖ్య యోగము. 4వ & 5వ శ్లోకములు.

 అర్జున ఉవాచ

శ్లో|| కథం భీష్మమహం సంఖ్యే
ద్రోణం చ మధుసూదన ।
ఇషుభి ప్రతియోత్స్యామి 

పూజార్హవరిసూదన ||(2-4)||

టీక:- అర్జున ఉవాచ = అర్జునుడు ఇట్లనెను, అరిసూదన = శత్రువులను నశింపజేయునట్టి, మధుసూదన = ఓ కృష్ణా! పూజార్హా = పూజింపదగినట్టి, భీష్మం = భీష్ముని, ద్రోణం చ = ద్రోణుని, సంఖ్యే = యుద్ధమునందు, అహం = నేను, ఇషుభిః = బాణములతో, కథం = ఎట్లు, ప్రతియోత్స్యామి = ఎదిరించి యుద్ధము చేయగలను?


శ్లో|| గురూ నహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహ లోకే
హత్వా
ర్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్
|| (2-5)||

టీక:– మహానుభావాన్ = మహానుభావు లైన, గురున్ = గురువులను, అహత్వా = చంపక, ఇహలోకే =  ఈ లోకమునందు, భైక్ష్యమపి = భిక్షాన్నమైనను, భోక్తుం = భుజించుటకు, శ్రేయోహి =శ్రేయముకాదా!, గురూన్ = గురువులను, హత్వాతు = చంపియో, ఇహైవ = ఈ లోకముననే, రుధిర ప్రదిగ్ధాన్ = రక్తముచే పూయబడిన, అర్థకామాన్ = అర్థకామరూపములగు (ధనసంపదలు, కామ్యవస్తువులు), భోగాన్ =భోగములను, భుంజీయ = భుజించువాడ నగుదును

భావము: అర్జునుడిట్లనెను-(కృష్ణా!!) "భీష్ముడు, ద్రోణుడు మొదలగు గురువులూ, మహానుభావులూ అయిన వారిమీద బాణములను ఏరకంగా సంధింప గలను? పూజ్యనీయులైన వారిని చంపి, రక్తసిక్తమైన రాజ్య సంపదలను భోగించుట కంటే ఈ లోకమున బిచ్చమెత్తుకొనియైనను జీవించుట శ్రేయస్కరము."

 

 

వ్యాఖ్యలు: 

1. అర్జునుడు యుద్ధ విరమణ కోసం కారణాలు వెతుకుతున్నాడు. బిక్షాటన క్షత్రియులకు తగినది కాదు. అయినా అర్జునుడు యుద్ధాన్ని వదిలి సన్యాసం తీసుకుంటాను అన్న సంకేతం ఇస్తున్నాడు. 

2. అన్యాయ పక్షమున నిలిచినందుకు వారు (ఆ గురువులు, ఆ మహానుభావులు) జీవించుటకు అర్హత కోలుపోయిరని పండితుల అభిప్రాయం.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి