భావము: ( అర్జునా !) నీవుగాని, నేనుకాని, ఈ రాజులు కానీ లేని కాలమే లేదు. ఇక ముందూ కూడా ఉందుము. (అన్ని కాలములలోను మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతం. ఆత్మ అన్ని కాలములయందును ఉండును. శరీర పతనంతో అది నశించునది కాదు).
వ్యాఖ్యలు:
చైతన్యము యెడతెగనిది: అన్నమాచార్యుల కీర్తన 'తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే' ఈ శ్లోకం యొక్క అంతరార్ధాన్ని తెలుపుతోంది. ముఖ్యంగా “తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము/ పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు” అనిచెప్పి మనిషిలోని చైతన్యము (చావుపుట్టుకలతో సంబంధము) లేకుండా యెడతెగని దానిగా వర్ణించారు.
“శాశ్వతమైనది ఏమిటి?” అనే దాని గురించి ముందు ముందు వివరించుకుందాం. అది మన శరీరము కానీ, మన భావనలు లేదా మన జ్ఞాపకములు కానీ కానే కాదు. ప్రస్తుతానికి ప్రతీ మానవునికి జీవన్మరణముల నుండి ముక్తి కలిగి శాశ్వతత్వం పొందే అవకాశం ఉందని ఈ శ్లోకము సూచించుచున్నది అని తెలుసుకుంటే చాలు.
అనుభవాల పొరలు: ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ప్రస్తుత జాగ్రదావస్థలో మనిషి పైపైనే తచ్చాడుతున్నాడని, మనిషిలో అనేక పొరల అనుభవాలు-జ్ఞాపకాలు దాగి ఉన్నాయని, నిజానికి ప్రతి మనిషిలోను ప్రపంచమే దాగి ఉందని, అనేకమార్లు ప్రస్తావించిరి.
పైవన్నీ గమనిస్తే శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పినదీ, అన్నమయ్య గారు చెప్పినదీ, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినదీ ఎంతో దగ్గరగా ఉండటం తెలియవచ్చును. మొత్తంమీద పైనచెప్పిన శ్లోకం చాల గుహ్యమైనది. మనమీ లోకములోనికి పొరపాటున రాలేదు, నిమిత్తమై వచ్చితిమి.
x-x-x-x
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి