శ్రీ భగవానువాచ:
శ్లో|| అశోచ్యాన్
అన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాం శ్చ భాషసే|
గతాసూ నగతాసూంశ్చ
నానుశోచంతి పండితాః ||(2-11)||
టీక: అశోచ్యాన్ =శోకింప తగని వారిని గూర్చి; అన్వశోచః = శోకిస్తున్నావు; త్వం
= నీవు; ప్రజ్ఞా-వాదాన్ = తెలివితేటలతో కూడిన మాటలు; చ = మరియు; భాషసే = పలుకుతున్నావు;
గత-అసూన్ = మరణించినవారి గురించి;
అగత-అసూన్ = బ్రతికున్నవారి గురించి ; చ — మరియు; న అనుశోచంతి — ఎప్పుడూ శోకించరు; పండితాః = పండితులు / వివేకవంతులు.
భావము: భగవానుడు ఇట్లనెను
"అర్జునా! విజ్ఞులైన వారు మరణించినవారిని గురించి కానీ, బ్రతికియున్న
వారిని గురించి కానీ దుఃఖింపరు. అయినప్పటికీ, శోకించ తగని
వానికై నీవు శోకించుచున్నావు. పైగా అన్నీ తెలిసిన పండితునిలా మాట్లాడ
ప్రయత్నిస్తున్నావు."
వ్యాఖ్యానము:
చాలామంది భగవద్గీత
ఈ శ్లోకంతో మొదలవుతుంది అని భావిస్తారు.
మన జ్ఞానము అజ్ఞానము: “అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం శ్చ భాషసే”.
ముందుగా, తానేమి చేయాలో తానే నిర్ణయించుకోలేని
స్థితిలో ఉన్న అర్జునుడు జ్ఞానిలా యుద్ధమున ప్రతిపక్షంలోని వీరులతో బాంధవ్యము
గురించి, యుద్ధ పర్యవసానము గురించి చేసిన వ్యాఖ్యలు
ఊహాత్మకములే కావున వాటి గురించి మాట్లాడుట కృష్ణుడు సరికాదనెను. శ్రీకృష్ణులవారు
"పండితుడైనవానికి సత్యము గోచరించును. వారు అర్జునునిలా మాట్లాడ ప్రయత్నించరు. పండితులు సత్యాన్ని గ్రహించి మిన్నకుందురు" అని
తెలుపుతున్నారు. అనగా పండితునిలా మాట్లాడ
ప్రయత్నించు వానికి బుద్ధి ఇంకా స్థిరం కాలేదని భావము.
జనన మరణ
రహస్యమే జ్ఞానము: మీకు ముందుగా విన్నవించుకున్నట్టుగా
ఈ శ్లోకము ఎంతో గహనమైనది. మానవునికి గోచరించు జననము మరణము
అను రెండు యధార్థములు అనేక విధములుగా అతనిని ప్రభావితం చేయును. భగవానుడు ఎటువంటి సందేహములకు తావివ్వకుండా, "విజ్ఞులు బ్రతికున్నవారి గురించి కాని, మరణించినవారి గురించి కాని దుఃఖింపరు" అని ఆనతిచ్చెను. జాగ్రత్తగా గమనిస్తే అర్జునుడి మనసును పీకి వేస్తున్నటువంటి శోకమే అతనిని
సరిగా చూడనివ్వకుండా అవరోధించుచున్నదని ఈ శ్లోకము యొక్క భావం. మన చూపులను అడ్డుకుంటున్నది ఏమియో లోతుగా
విచారించినది భగవద్గీత. (అందుకనే "పశ్యతి" (=చూచునది) అనేకమార్లు గీతలో కానవచ్చును.
పట్టియుంచినదే అవరోధము: ఈ రకముగా
చూచిన, చూచే చూపులను ప్రభావితం చేయు నవి మనము ఆయా వాటిపై ఏర్పరచుకున్న భావములే కదా! అవియే జ్ఞాపకములు. వానికి విజ్ఞులు తావు ఇవ్వరు అని
తెలియవచ్చు.
ఆ దారిలో తీర్పులు,
తీర్మానములు బండరాళ్ళు: అనగా వారు జీవన్మరణముల భారమును దైవముపై నిలిపి శరీర యాత్రకు
సన్నద్ధులగుదురు. ఆ దైవము సేవలొ వారికి రెండున్నూ ఒకటే. "జీవించి యుండుట సరి"; "ఆ మరణము సరి
కాదు" అను తీర్పులు లేదా నిర్ణయములతోనూ, క్షణక్షణమునకు తామే తెచ్చిపెట్టుకున్న వూహలతోనూ తమ మదిని
నిండుగా ఆక్రమించుకొన్న ఆలోచనలతోనూ అవి కలిగించు దుఃఖములతోనూ సతమతమౌతూ కాలమును
వెళ్ళబుచ్చరు.
పండితులు అరుదు: పండితుడనగా ఎవ్వరు? వేదము, విద్వత్తు, పాండిత్యములతో
మదిని నింపుకున్నవారు కానేకారని స్పష్టము. ఇప్పటి వరకు మరణము అనుదాని అనుభవమును
ప్రత్యక్షముగా కలిగిన వారు చాలా అరుదు అని తెలియుచున్నది. భగవద్గీతలో పేర్కొన్న పండితులైనవారు
కూడా చాలా చాలా అరుదే నని భావింపవలెను.
యోగము:
ప్రకృతికి ఒడబడి చేయు ఆ యత్నము సామాన్యము. దానికి ఒడబడకుండుట
అసాధారణము. యోగము అనగా ప్రయత్నము, కూడిక, కూర్పు
మరియు అసహజము. అపూర్వమైనది సాధించుటకు అపూర్వ యత్నము,
సాహసము తప్పనిసరి. మానవుని ఆ ప్రయత్నము
మాత్రమే అపూర్వవస్తుప్రాప్తికి మార్గము. తక్కినవి అజ్ఞానము
లోని భాగములు. అవి వొప్పుట, లోబడుట, అనుసరించుటలోని
భాగములని విశద పరుచుకొనవలెను. భగవద్గీత చదివి ఆనందించుటకు మాత్రం వ్రాయబడలేదు.
కావున ఆ క్లిష్టమైన దాదాపు అసాధ్యమైన పనికి వొడబడువాడు యోగి
అనబడును.
చర్చించ తగని విషయము: క్రింది
అన్నమాచార్యుల పల్లవిని కూడా చూడండి. చాలా స్పష్టంగా పండితులైనవారు నరకమును
మృత్యువును దాటిన స్థితిలో స్థిరముగా వుండి అలౌకికమైన దశకు చేరుకుందురని
తెలియవచ్చును. (ఆ దశ గూర్చి మనకున్నది పరోక్ష జ్ఞానమే. కావున చర్చించ తగని విషయము)
ఎక్కడి నరకములు యెక్కడి మృత్యువు మాకు
దక్కి నీ దివ్యనామామృతము చూరగొంటిమి ॥పల్లవి॥
సత్యమును గ్రహించుటయే జీవము. జననం, మరణం రెండే రెండు పరమ వాస్తవాలు. అనివార్యమైన ఈ అవధుల మధ్య కాలమును సిద్ధాంతాలతోను, వెదుకుటలోనూ వృథా చేయవద్దు. మానవులారా! మీ ఇప్పటి అవగాహనలను ప్రక్కన
బెట్టి, ఎదురుగా వున్న ఈ ప్రపంచమును కనుగొనుడీ! అని ఈ శ్లోకం
యొక్క గూడార్థం. సత్యమును గ్రహించుటయే జీవము & జీవనము.
నిరాధారమైన ఉద్యోగము: ప్రస్తుత
సందర్భంలో అర్జునుడు రాజ్యము కోసము, పాండవులు
ధర్మమని అనుకుంటున్న దాని కోసము, ముందుగానే
జయాపజయములను నిర్ణయించి తన కళ్ల ముందు, తానే
జరపబోయే మారణహోమం తలచుకుని దుఃఖించాడు. మానవుల ఈ నిరాధారమైన ‘తలపులు’ అను వ్యవసాయము (=ఉద్యోగము) అనేకానేక యుద్ధాలకు, తరగతులుగా విభజనలకు, మారణహోమములకు దారితీసిందని మనందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో మానవుడు
ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మూలకారణాలలో ఒకటైన యీ విషయాన్ని తప్పక విశ్లేషించవలె. అర్ధముచేసుకోవలె. ముందుగా క్రింది రీని మాగ్రిట్టె
గారు లో గీసిన 'లా కార్ట్ బ్లాంష్' (= తెల్లకాగితము) పేరిట ప్రపంచ ఖ్యాతినొందిన ఈ క్రింది
చిత్రమును జాగ్రత్తగా పరిశీలించండి.
ఉన్నది ఉన్నట్లుగా చూడలేము:
పై చిత్రము పరిక్షించిన
మీదట అది అసాధ్యమని తెలిసిపోతుంది. చిత్రములో చూపినట్లు గుర్రమును దాని రౌతును ఊహించుట
పొందికలేని విషయమే. జాగ్రత్తగా గమనించితే అక్కడ మూడు భాగాలుగా కత్తిరించిన గుర్రపురౌతు
బొమ్మను ఉంచారు. కానీ, విశ్లేషణతో సంబంధము లేకనే మనస్సు అక్కడ గుర్రము ఉన్నట్లు మనస్సు నమ్మును. దీనిపై మరికొంత వివరణ క్రింది బొమ్మలో
పొందవచ్చు.

చేయరాని
ప్రయత్నము:
పై బొమ్మలలో దృష్టాంతీకరించినట్లు లేనిదానిని మనస్సు ఉన్నట్లు ఎట్లు
చేకొనునో, అటులనే తరువాతి
రోజుకు జీవితము విస్తరించుటకు చేయు
సన్నాహములు వృధా ప్రయాస అని అర్ధము. కానీ, ప్రపంచములోని వార్తలలో ఆకలి మరణాలు, పేదఱికము, అసమానతలు, దోపిడి, పీడనలు, ధనికుల
విలాసవంతమైన జీవితములు వగైరాలు సాధారణ మానవుని మనస్సుపై వాటి వాటి పంజాలు
విసురును. దానితో మానవుడు తనకైతాను సృజించు తర్కముపై అధిక నమ్మకముంచి (ఇక్కడ
అర్జునుని వలె) సత్యమును ప్రక్కకు నెట్టివేయును. తన ప్రయత్నములతో శాంతిని, సమాధానమును
పొందగలనని నమ్మును.
సార్వత్రిక క్లేశము: ఇలా ధర్మమును, న్యాయమును పాటించక, ఎవరికివారు తమ తమ ప్రయత్నాలతో
శాంతిని పొందు ప్రయాసలతో ప్రపంచమున విధ్వంసం సృష్టించారు. ఈ అసంగతములను, ఈ గందరగోళములను, ఈ అలజడులను, ఈ
విచ్ఛిన్నములను ఎవరైనా పరిశీలించి అనుభవించగలరు. పలుమార్లు పేర్కొన్న శాంతి
సమాధానముల మార్గమున ఏమి చెయ్యరాదో భగవద్గీత
విశదముగా తెలిపింది.
అస్తవ్యస్తానికి
మూలకారణం:
అర్జునుడి వాదనలు,
తార్కికంగాను మరియు బాగా హేతుబద్ధంగాను ఉన్నప్పటికీ, కృష్ణుడు వాటిని కొట్టిపారేశాడు. నిమిత్తములు కారణములు
తరచుగా గందరగోళానికి మరియు సంఘర్షణకు దారి తీస్తాయి. కానీ ఎవరి తర్కములు, కారణములు వారివి. కొన్ని సముదాయములు, కొందరు మనుషులు
ఏర్పరచుకున్న తర్కములు, కారణములు, వేరే
వారి తర్కములు, కారణములతో పోల్చుకుంటే భిన్నముగా నుండును. ఇవి
ఒకదానితోనొకటి పోటీపడు సిద్ధాంతాలను మరియు దృక్కోణాల జాలమును (వలను) సృష్టిస్తాయి.
వీనిలో ప్రతి ఒక్కటి మానవుని వేర్వేరు
దిశల్లో లాగుతాయి. అందుకే కృష్ణుడు అర్జునుని మేధోపరమైన తర్కాన్ని విస్మరించాడు.
మానవుడు తన శరీరమును, బుద్ధిని, ఆత్మను
ఒకత్రాటిపై తీసుకొని రాకున్న సత్యాన్ని గ్రహించలేడు. కావున మేధోపరమైన విశ్లేషణతో
ఏమీ సాధించలేము.
x-x-x-x
అనుమిత (ఉప) సిద్ధాంతములు (corollaries):
సత్యాన్ని చేరుకోవడానికి మానవుడు తనకు సత్యమునకు మధ్య వున్న సర్వ అవరోధములను, మరణమును సైతము లెక్కించక, త్యజించి ప్రక్కకు నెట్టివేయవలెను.
ఊగిసలాట: మనల్ని మనం గమనిస్తే మనం 'కారణము' ('తెలిసియుండుట') మరియు 'అకారణము'ల ('తెలియకుండుట' 'అజ్ఞానం') మధ్య ప్రపంచంలో ఊగిసలాడుతూ వున్నామని కనుగొంటాం. మన ప్రస్తుత ఉనికి ఈ రెండు పరిమితుల మధ్య ఉంటుంది (2-28 మరియు 4-18 కూడా చూడండి). పరివర్తనకు లోనయ్యే వస్తువులన్ని అశాశ్వతంలో భాగం. ఈ స్థితిలో నిజానిజాలు తెలిసే అవకాశం లేదు.
ఏమీ అర్థముగాని స్థితి: నిజంగా చెప్పాలంటే మన స్థితిలోని మార్పులను మాత్రమే మనము గమనించ గలుగుతాము. మనం 'అవగాహన' పొందినప్పుడు, ఆ ముందు క్షణం వరకు మనం 'అవగాహన లేని' స్థితిలో వున్నామని అర్థం. దీని వ్యతిరేకమూ వాస్తవమే. దీంతో మనమున్న వాస్తవ పరిస్థితిపై అయోమయంలో ఉంటాం. (4-17 & 4-18 కూడా చూడండి)
మనిషి వాస్తవ స్వరూపం: ఈ అధ్యాయము ముందర 4 నుండి 8 వరకు వున్న శ్లోకములు మనిషి వాస్తవ స్వరూపాన్ని సూచిస్తాయి. ఒక ప్రక్క మనకు తెలిసిన తర్కముపయోగించి విశ్లేషణ చేయబోతాము. ఇంకో ప్రక్క దైవమా నన్ను రక్షించు అని శరణాగతిని కూడా చేయబోతాము. మనము ద్వందనీతిని అవలంభిస్తాము.
అందుకనే కృష్ణుడు సూటిగా పండితునిలా మాట్లాడటం కాదు, పండితునిగా జీవనము సాగించు అని సందేశం ఇచ్చాడు. ఇప్పటి మన జీవన విధానంలో గణనీయమైన మార్పులేకున్న మనము కేవలము జీవన్మృతులమని ఈ శ్లోకము భావము.
x-x-x-x
భగవద్గీత సారాంశము.
11-16 వరకు గల శ్లోకముల యుక్తియుక్తమైన
న్యాయదర్శనము.
(Orderly exposition of Bhagavad Gita)
11వ శ్లోకము: జననం, మరణం అనునవి మానవుని నిరంతరముగా పరీక్షించుచున్నవి. వీటిని దాటి శాశ్వతమైన దానిని
పండితులైనవారు కనుగొనగలరు.
12వ శ్లోకము:
మానవుని శరీరమును మనసును ఒక దగ్గరగా చేర్చి
ఉంచిన “ఆత్మ” అనుదానికి శాశ్వతత్వమును ఆపాదించారు.
13వ శ్లోకము:
ఈ జననమరణ చక్రము తనలోనే జరుగుతుండగా పరిశీలించ
గలిగిన ధీరుడు పండితుడు అనబడును.
14 & 15వ శ్లోకములు:
ఈ మార్పులను ధైర్యముగాఁ ఏమాత్రము విరోధించక
ఉన్నది ఉన్నట్లు స్వీకరించే వానికి మోక్షము సిద్ధించునని వివరించారు.
16వ శ్లోకము:
“తత్త్వదర్శిభిః' అనగా తత్వమును లేదా సత్యమును ప్రత్యక్షముగ చూచినవారు (కేవలము విని చదివి తెలుసుకున్నవారు కారు, ఆ
శాశ్వతత్వము అనుభవించి చెప్పినవారు) ఈ విషయమును
నిర్ధారించిరి.
x-x-సమాప్తము-x-x