అర్జునుడు
అడిగిన మూడు ప్రశ్నలు మనల్ని ఆలోచింపచేస్తాయి.
జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్ఠమైనదయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? (తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ 3-1) అర్జునుడు ఇలా అడగడం గమనార్హం. జాగ్రత్తగా ఆలోచిస్తే మనం చేసే పనులన్నీ ఏదో విధంగా పరులకు నష్టం కలిగించేవే. ఉదాహరణకు ఒక వస్తువు తయారు చేసే సంస్థను తీసుకోండి. ఆ సంస్థ అదే వస్తువు చేసే సంస్థలతో తలపడుతుంది. ఈ పోటీ ఒకరినొకరు నష్టపరచుకునే దిశగా వెళుతుంది. అదే రకంగా ఉద్యోగుల మధ్య మనస్పర్ధలకు ఈ పోటీతత్వమే కారణం. పైపైకి నిరపాయంగా కనిపించే మానవుల కార్యములు ఎదో విధంగా సంఘ విచ్ఛిత్తికో, పర్యావరణ పతనమునకో దారి తీస్తాయి. ఈ ప్రపంచంలో కనబడు అస్తవ్యస్థ పరిస్థితి పరిస్థితికి మనిషి లోని పోటీతత్వమే కారణము. ఆ రకంగా యుద్ధం ప్రత్యక్షంగాను, వేరు కార్యములు పరోక్షంగాను జీవ మార్గం నుండి మానవుణ్ణి దిగజారుస్తాయి, విడదీస్తాయి.
కృష్ణుడు
చెప్పేది మాటల గారడీ అని అర్జునుడు భావించాడు. (వ్యామిశ్రేణేవ
వాక్యేన బుద్ధిం మోహయసీవ మే 3-2). అసలు మాటకొస్తే,
ఈ విషయాలను చూస్తే ఎవరైనా కేవలం పదాలుగా (సత్యము కాదని) భావిస్తారు,
చెప్పిన అసలు విషయం అంతుచిక్కనిది కాబట్టి, నమ్మడం
కష్టం. ఇంకా, చేతివేళ్ళతో లెక్కించ గలిగినంత మంది మాత్రమే
అటువంటి స్థితికి చేరుకున్నారు. పైగా అది ఆలోచనలకు కానీ, ఊహలకు
కానీ అందనిది. కాబట్టి అర్జునుడి మాటలు భగవద్గీత ఆచరణకు పెద్ద పీట వేసినట్లు
తెలియవలెను.
శ్రీ
కృష్ణా, ఎందుకు మానవులంతా అయిష్టంగానయినా, బలవంతంగా
ఏదోశక్తి చేయించినట్టు, పాపపు పనులు చేయటానికి
ప్రేరేపింపబడుతున్నారు? (అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ
నియోజితః 3-36) ఈనాటి ప్రపంచం ఈ ఒక్క నిజాన్ని
చక్కగా ప్రతిబింబింప చేస్తోంది. భగవద్గీత ఎంతో లోతైనది అని
చెప్పడానికి ఈ మూడు ప్రశ్నలు సాక్ష్యం.
ఈ కర్మయోగంలో
యజ్ఞము (లేదా త్యాగము) గురించి ఎక్కువగా పొందుపరిచారు. ముందుగా (అనేన ప్రసవిష్యధ్వమ్ ఏష
వోఽస్త్విష్టకామధుక్ 3-10) ఏదీ ఆశించకుండా మానవుడు
నిర్వికారస్థితిలో ఉండగా అతనికి కావలసిన అన్నింటినీ ప్రకృతియే సమకూర్చును అని
చెప్పడంమైనది. కావున కర్మయోగం ఏదో ఒక విషయమును ఒక స్థితిని
సాధించుటకు చెప్పబడలేదు. మానవుడు యత్నం ద్వారా పొందునది
దుఃఖము అని చెప్పారు. అతి జాగ్రత్తగా గమనిస్తే మనం చేసే
పనులన్నీ ఏదో విధంగా పరులకు నష్టం కలిగించేవే.
తమకై
తాము వండుకునేవారు పాపమునే భుజించుచున్నారు. (భుఞ్జతే తే త్వఘం పాపా యే
పచంత్యాత్మకారణాత్ 3-13). అనగా స్వార్థం కొరకు
(ఆత్మరక్షణతో సహా) చేయు చర్యలన్నియు పాపములే.
మానవుని అంతరంగం
నుండి నడిపించు రజో గుణ ప్రవృత్తి అతని అతనిని ఏదో ఒక కార్యము చేయుటకు
పురికొల్పును. కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ
వైరిణమ్: (3-37). ఈ కార్యోన్ముఖుని
చేయు శక్తి మానవునికి సకారాత్మకముగాను, రూఢియైనదానిగాను
కనపడును. విచక్షణా శక్తిలేని మానవులకు చేయతగిన చేయకూడని పనులను నిర్ధారించు శక్తి
లేదు. కావున “కార్యము చేయవలెను”
అని లోపల నుండి ఎంత తన్నుకు వస్తున్నట్లనిపించినా ఆ ఉబలాటమును నియంత్రించుటయే చేయగల కార్యము,
అంతేకాని ఏదో ఒక పని చేయుట కాదు.
కోరికల
రూపంలో ఉన్న శత్రువు (=ఏదో చేయవలెను ఉబలాటం) అగ్నివలె మండుతూనే ఉంటుంది. (కామరూపేణ కౌంతేయ
దుష్పూరేణానలేన చ 3-39) కాబట్టి పైన పేర్కొన్న నియంత్రణ
సులభమైంది కానేకాదు. నిరంతరము మానవుల్ని వేధిస్తున్న కోరికలు
ఏదో ఒక రకముగా బయట పడును. ఆ రకముగా కార్యములలో తగులుకోకుండా బయటపడు
మార్గమే యజ్ఞము. ముఖ్యముగా మానసికముగా మనల్ని పీడిస్తున్న
రక్షణ అను జాడ్యము నుండి బయటకువేయు అడుగులే యజ్ఞము.
"మానవుడు చేపట్టగల కార్యములు ఏమి?" అని విచారించ పని లేదు. ఇంతకు ముందు అధ్యాయములో చెప్పుకున్నట్టు మానవుడు చేయగల కార్యములు ఏమి లేవు. అదే విషయము ఈ అధ్యాయంలో కూడా పునరుద్ఘాటించిరి. మానవుడు పాప పుణ్యముల విచారణను విచారణలో తన సమయమంతా వెచ్చించును. పాప పుణ్యములను విచారించే సామర్థ్యం మానవునికి లేదు. కాబట్టి ఆ విచారణను సమగ్రముగా సమూలముగా వదలి వైచిన అతను సుఖపడును అన్న విషయం తెలియవలెను. (refer 5-15)
ఈ అధ్యాయంలో శ్లోకములు ఒకటొకటిగా గమనించిన అత్యంత ఆచరణాత్మకమైన విధానం మన కనులముందట విశదముగా ప్రత్యక్షం చేయుచున్నది. ఇదియే కర్మ యోగం యొక్క విశేషము.
x-x-x-x-


