21, డిసెంబర్ 2024, శనివారం

3వ అధ్యాయము: కర్మ యోగము: ఒక పరిచయము

అర్జునుడు అడిగిన మూడు ప్రశ్నలు మనల్ని ఆలోచింపచేస్తాయి.

జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్ఠమైనదయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు(తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ 3-1) అర్జునుడు ఇలా అడగడం గమనార్హం. జాగ్రత్తగా ఆలోచిస్తే మనం చేసే పనులన్నీ ఏదో విధంగా పరులకు నష్టం కలిగించేవే. ఉదాహరణకు ఒక వస్తువు తయారు చేసే సంస్థను తీసుకోండి. ఆ సంస్థ అదే వస్తువు చేసే సంస్థలతో తలపడుతుంది. ఈ పోటీ ఒకరినొకరు నష్టపరచుకునే దిశగా వెళుతుంది. అదే రకంగా ఉద్యోగుల మధ్య మనస్పర్ధలకు ఈ పోటీతత్వమే కారణం. పైపైకి నిరపాయంగా కనిపించే మానవుల కార్యములు ఎదో విధంగా సంఘ విచ్ఛిత్తికో, పర్యావరణ పతనమునకో దారి తీస్తాయి. ఈ ప్రపంచంలో కనబడు అస్తవ్యస్థ పరిస్థితి పరిస్థితికి మనిషి లోని పోటీతత్వమే కారణముఆ రకంగా యుద్ధం ప్రత్యక్షంగాను, వేరు కార్యములు పరోక్షంగాను జీవ మార్గం నుండి మానవుణ్ణి దిగజారుస్తాయివిడదీస్తాయి.

కృష్ణుడు చెప్పేది మాటల గారడీ అని అర్జునుడు భావించాడు. (వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే 3-2). అసలు మాటకొస్తే, ఈ విషయాలను చూస్తే ఎవరైనా కేవలం పదాలుగా (సత్యము కాదని) భావిస్తారు, చెప్పిన అసలు విషయం అంతుచిక్కనిది కాబట్టి, నమ్మడం కష్టం. ఇంకా, చేతివేళ్ళతో లెక్కించ గలిగినంత మంది మాత్రమే అటువంటి స్థితికి చేరుకున్నారు. పైగా అది ఆలోచనలకు కానీ, ఊహలకు కానీ అందనిది. కాబట్టి అర్జునుడి మాటలు భగవద్గీత ఆచరణకు పెద్ద పీట వేసినట్లు తెలియవలెను. 

శ్రీ కృష్ణా, ఎందుకు మానవులంతా అయిష్టంగానయినా, బలవంతంగా ఏదోశక్తి చేయించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడుతున్నారు? (అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః 3-36ఈనాటి ప్రపంచం ఈ ఒక్క నిజాన్ని చక్కగా ప్రతిబింబింప చేస్తోంది. భగవద్గీత ఎంతో లోతైనది అని చెప్పడానికి ఈ మూడు ప్రశ్నలు సాక్ష్యం.

ఈ కర్మయోగంలో యజ్ఞము (లేదా త్యాగము) గురించి ఎక్కువగా పొందుపరిచారు. ముందుగా (అనేన ప్రసవిష్యధ్వమ్ ఏష వోఽస్త్విష్టకామధుక్ 3-10) ఏదీ ఆశించకుండా మానవుడు నిర్వికారస్థితిలో ఉండగా అతనికి కావలసిన అన్నింటినీ ప్రకృతియే సమకూర్చును అని చెప్పడంమైనది. కావున కర్మయోగం ఏదో ఒక విషయమును ఒక స్థితిని సాధించుటకు చెప్పబడలేదు. మానవుడు యత్నం ద్వారా పొందునది దుఃఖము అని చెప్పారు. అతి జాగ్రత్తగా గమనిస్తే మనం చేసే పనులన్నీ ఏదో విధంగా పరులకు నష్టం కలిగించేవే.

తమకై తాము వండుకునేవారు పాపమునే భుజించుచున్నారు. (భుఞ్జతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ 3-13). అనగా స్వార్థం కొరకు (ఆత్మరక్షణతో సహా) చేయు చర్యలన్నియు పాపములే.

మానవుని అంతరంగం నుండి నడిపించు రజో గుణ ప్రవృత్తి అతని అతనిని ఏదో ఒక కార్యము చేయుటకు పురికొల్పును. కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్: (3-37). ఈ కార్యోన్ముఖుని చేయు శక్తి మానవునికి సకారాత్మకముగాను, రూఢియైనదానిగాను కనపడును. విచక్షణా శక్తిలేని మానవులకు చేయతగిన చేయకూడని పనులను నిర్ధారించు శక్తి లేదు. కావున కార్యము చేయవలెనుఅని లోపల నుండి ఎంత తన్నుకు వస్తున్నట్లనిపించినా  ఆ ఉబలాటమును నియంత్రించుటయే చేయగల కార్యము, అంతేకాని ఏదో ఒక పని చేయుట కాదు.

కోరికల రూపంలో ఉన్న శత్రువు (=ఏదో చేయవలెను ఉబలాటం) అగ్నివలె మండుతూనే ఉంటుంది. (కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ 3-39) కాబట్టి పైన పేర్కొన్న నియంత్రణ సులభమైంది కానేకాదు. నిరంతరము మానవుల్ని వేధిస్తున్న కోరికలు ఏదో ఒక రకముగా బయట పడును. ఆ రకముగా కార్యములలో తగులుకోకుండా బయటపడు మార్గమే యజ్ఞము. ముఖ్యముగా మానసికముగా మనల్ని పీడిస్తున్న రక్షణ అను జాడ్యము నుండి బయటకువేయు అడుగులే యజ్ఞము.

"మానవుడు చేపట్టగల కార్యములు ఏమి?" అని విచారించ పని లేదు. ఇంతకు ముందు అధ్యాయములో చెప్పుకున్నట్టు మానవుడు చేయగల కార్యములు ఏమి లేవు. అదే విషయము ఈ అధ్యాయంలో కూడా  పునరుద్ఘాటించిరి. మానవుడు పాప పుణ్యముల విచారణను విచారణలో తన సమయమంతా వెచ్చించును. పాప పుణ్యములను విచారించే సామర్థ్యం మానవునికి లేదు. కాబట్టి ఆ విచారణను సమగ్రముగా సమూలముగా వదలి వైచిన అతను సుఖపడును అన్న విషయం తెలియవలెను. (refer 5-15)

ఈ అధ్యాయంలో శ్లోకములు ఒకటొకటిగా గమనించిన అత్యంత ఆచరణాత్మకమైన విధానం మన కనులముందట విశదముగా ప్రత్యక్షం చేయుచున్నదిఇదియే కర్మ యోగం యొక్క విశేషము.

x-x-x-x-


2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము - ముఖ్యాంశాలు

1. అపరిమితమైన దుఃఖము కీలక ఘట్టములలో సంభవించును (2-2).

2. మనో దుర్బలత్వంచే మానవులు నిర్వీర్యులగుచున్నారు(2-3).

3. పండితులైనవారు జీవనమును మరణమును ఒకే విధంగా స్వీకరించుదురు. (2-11)

4. మానవులకు శాశ్వతత్వం పొందు అవకాశం ఉంటుంది.(2-12).

5. ఏది విశ్వమంతటను వ్యాపించి ఉన్నదో, అవ్యయమగు దానిని  వినాశము చేయులేరు. అప్రమేయుడు దేహము నందున్నాడు. కానీ దేహములు నాశవంతములు కావున ఆ స్థితి నుండి తెలియబడడు (2-17).

6. జీవన్మరణముల చక్రములు మానవుల ముందుంచిన అతి క్లిష్టమైన పరీక్షలు (2-27).

7. మానవుడు ఈ జీవ మున్న​ చిన్ని కాల వ్యవధి అందే తాను పొందిన అవకాశమును సార్థకం చేసుకొనవలెను (2-28).

8. మానవులు చేపట్టుటకు ఒకే ఒక మార్గం కలదు (2-41). తక్కినవన్నీ అపమార్గములు.

9. సమత్వంలో స్థితుడై ఉండుట ఒకటియే పేర్కొనబడినది (2-48).

10. కర్మ ఫలమును గోరువారు అల్పులు (2-49).

11. ఆ మార్గాన్వేషణమున భోగైశ్వర్యముల యొక్క ప్రసక్తి ఉండదు. స్వర్గనరకములు,  పుణ్యపాపముల ప్రసక్తి ఉండదు. నిష్కామకర్మ ఒక్కటియే సూచించబడినది (2-50).

12. (శబ్దాది) విషయములు ఎండగొట్టుటవలను, దూరముగా ఉంచుట వలనను ​ తొలగుటలేదు. అవి కేవలము సత్య దర్శనం వలననే తొలగుచున్నవి. (2-59).

13. ఇంద్రియముల చర్య​లు జీవులందరి మీద ఒకే విధమైన ప్రభావం చూపించును. అప్రమత్తత లేక జీవులు బాధలను పడుతున్నారు. (2-68).

14. మన ఎదుటి ప్రపంచము విలోమ దర్పణంలా పనిచేయుచు పరీక్షించు చున్నది. యోగులు జీవనమును తెలియుటలోను; జీవులు విషయములు అనుభవించుటలోనూ సమయం వెళ్ళబుచ్చుదురు (2-69).

15. ఆ గంభీరమైన స్థితికి చేరినప్పుడు లోపలి/వెలుపలి విషయములు మానవుని బాధింపలేవు. (2-70)

x-x-x-x

సాంఖ్య యోగము. 2-71 & 72వ శ్లోకములు

శ్లో|| విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి
||(2-71)||

టీక:- యః పుమాన్= ఏ మనుజుడు;  సర్వాన్ = సమస్తములైన; కామాన్ = కోరికలను, శబ్దాదివిషయములను; విహాయ = విడిచి; నిస్స్పృహః = వానియందు అశలేనివాడును; నిర్మమః = మమకారములేనివాడును; నిరహంకారః= అహంకారవర్జితుడును అయి; చరతి= సంచరించుచున్నాడో; సః = ఆతడు; శాన్తిమ్ = శాంతిని; అధిగచ్ఛతి = పొందుచున్నాడు.

భావము:   ఎవడు సమస్తములైన కోరికలను, శబ్దాది విషయములను త్యజించి వానియందే మాత్రము ఆశలేక, అహంకార మమకారవర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు.

శ్లో||  ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి
స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి
||(2-72)||

టీక:– పార్ధ= ఓ అర్జునా!, ఏషా= ఇది, బ్రాహ్మీస్థితిః= బ్రహ్మసంబంధమైనస్థితి, ఏనామ్ = దీనిని, ప్రాప్య= పొంది, న విముహ్యతి = విమోహమును జెందడు, అన్తకాలే 2 పి = అంత్యకాలమందుగూడ, అస్యామ్ = ఈ స్థితియందు, స్థిత్వా = నిలిచి, బ్రహ్మనిర్వాణమ్ బ్రహ్మానందమును (మోక్షమును), ఋచ్ఛతి = పొందుతున్నాడు.

భావము: అర్జునా! ఇదియంతయు బ్రహ్మసంబంధమైన స్థితి; ఇట్టి బ్రాహ్మీస్థితిని బొందినవాడు మఱల నెన్నటికిని విమోహమును జెందనేరడు. అంత్యకాలమునందు గూడ ఇట్టి స్థితియందున్నవాడు బ్రహ్మానందరూప మోక్షమును బడయుచున్నాడు. 

వ్యాఖ్యానము:

మొదటి భాగము

చదివి తెలుసుకోలేము: ఇక్కడ అతి ముఖ్యమైన విషయం పై శ్లోకములలో తెలిపిరి. ఇవి చెప్పినంత సులభం కాదు. వీటి వెనుక కఠోరమైన శ్రమ దాగి ఉన్నది. చాలా మంది వీటి పైపై అర్థములు చదివి ‘ఆత్మ’ ‘శాంతి’ ‘సమస్థితి’, ‘నిష్కామకర్మ’ మాకు తెలిసిపోయాయి అన్ని సంతోషపడిపోతూ ఉంటారు. ఏదో చదివి తెలుసుకుంటే వచ్చేవి కాదు ఇక్కడ చెప్పిన విషయములు. 

సుపరిచితము, అపరిచితము: ఇక్కడ చెప్పిన గంభీరమైన విషయమును పదమూడవ హంస అను హిల్మా ఆఫ్ క్లింట్ సంజ్ఞలతో కూడిన ఆకర్షణీయమైన డయాగ్రమ్ ద్వారా ఈ శ్లోకముల (2-71& 72) భావనను పరిశోధిద్దాం. తన శైలికి అనుగుణంగా, హిల్మా తరచుగా తన కళాకృతులను క్షితిజ సమాంతరంగా విభజిస్తుంది. ఒక భాగం సుపరిచితమైన ప్రపంచాన్ని వర్ణిస్తుంది. మరొకటి రహస్యమైన చీకటి కోణాలను సంగ్రహిస్తుంది. ఈ రేఖాచిత్రం మధ్య భాగము ఏకాగ్రతతో ఆత్మ పరిశీలన చేసుకుంటున్న ఒక మనిషి తలను పోలి ఉంటుంది. మానవాళి అనుభవిస్తున్న సమస్త పీడనలు, భావనలు ఆ ఒక్కని మనసులోనికే  చొచ్చుకొని పోవుచున్నవా అను భావనను కలుగజేస్తుంది.



13వ హంస: ఎగువ మరియు దిగువ భాగాలు ఒకదానికొకటి విలోమ దర్పణాలుగా కనిపిస్తాయి, ఈ ప్రతిబింబాల యొక్క శాశ్వతత్వమును సూచిస్తూ అక్కడ రెండు త్రికోణాలను చూపించారు. ఈ త్రికోణములలో, పైకికానీ, క్రిందకు కానీ వెళుతున్న కొలది సత్యము చెల్లాచెదరై  అనేక పీలికలుగా విడిపోయి గ్రహించ సాధ్యము కాదు.  ఐతే కేంద్రం వద్ద ఈ విలోమ ప్రతిబింబాలు కలిసిపోయి ఏకత్వాన్ని సూచిస్తాయి. ప్రకాశవంతంగా వెలుగుతున్న కేంద్రమునకు అటు ఇటు గల త్రికోణములు చిందరవందరైన సత్యమును చూపుతున్నాయి. కేంద్రం నుండి అటు ఇటు తచ్చాడు స్థితిని అన్నమాచార్యులు "చెంచెత" అని పేర్కొన్నారు. 

ఏకాగ్రత స్థితి: మానవుడు ప్రస్తుత పరధ్యాన స్థితి నుండి ఏకాగ్రత స్థితికి మారినప్పుడు, అక్కడ ఏకత్వం మాత్రమే ఉంటుంది. మనస్సు యొక్క పొరలలో లోతుగా, ప్రస్తుత చేతన స్థితిలో చేరుకోలేని ప్రయాణాన్ని ప్రారంభించడమే శరణాగతి. ఈ విధంగా, కేంద్రం వైపు ఈ ప్రయాణము ‘తెలిసిన దాని’ నుండి "నేను ఏమీ కాను" అనేదానికి - ఒక కదలికను సూచిస్తుంది. ఇది ఊహాజనిత ప్రయాణం కాదు. వాస్తవముగా మనిషి తన సమస్త శక్తులను వినియోగించి చేయగల ఏక మార్గ (oneway) ప్రయాణం.

తన తోకను తానే తినే పాము: నిజానికి, మనస్సును తెలిసిన మరియు తెలియని రెండు విషయములు చుట్టుముట్టినప్పుడు, ఏవి ప్రతిబింబాలో మరియు సత్యములో  వేరు పరచడం కష్టమవుతుంది. ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి, ఆశ్రయణం, (=ఆశ్రయము కల్పించు మిథ్యా స్థితి) లెదా  స్థితివ్యాజం (=స్థితి కల్పించు బూటకములు) అడ్డుపడతాయి. కండిషన్డ్ మైండ్ మనకు అందించే ప్రతిబింబాలను గుర్తించి త్యజించడం అత్యవసరం. ఈ ఏరివేత పని సులభ సాధ్యము కాదు. ఏలయనగా అన్వేషకుడు స్వాభావికంగా దానిలో భాగం కావడం ద్వారా, నిష్పక్షమైన ఏరివేతకు  ఆటంకం కలుగుతుంది. ఇది పాము తన తోకను మ్రింగివేసినట్లు ఉంటుంది. దాని స్వంత సారాంశంతో అల్లుకున్న వృత్తాకార అన్వేషణ. అపమార్గము. 

సర్వావస్థలలో చైతన్యము (Being aware is the complete action): మనిషి చేతిలో ఉన్నది కేవలము తానున్న స్థితిని గ్రహించి ఊరకుండుట. అటుల  చేసిన యెడల మనస్సు యొక్క చంచలములు తగ్గిపోయి ప్రశాంతతకు తావు లభించును. ఇంతకుముందు పేర్కొన శ్లోకములలో చెప్పిన శాంతి ఇదియే. పై బొమ్మలో చూపించినది ఆ సమత్వ స్థితిలో ఉన్నటువంటి అనేక దృగ్విషయాల మధ్య ఉన్న ఉద్రిక్తతతను ఈ చిత్రం చూచిన వెంటనే తెలియవచ్చును. అప్పుడు సమత్వస్థితి యొక్క అతి విశిష్టమైన లక్షణము కూడా బోధపడును. యుద్ధరంగములోవున్నా కూడా అర్జునునికి భగవానుడు సమత్వమును ఏల బోధించినది తెలియవచ్చును.

రెండవ భాగము

వేటగాడు: ఈ సందర్భంగా క్రింది అన్నమాచార్యుల కీర్తన కూడా పరిశీలించిన వ్యాఖ్యానము సమగ్రముగా ఉండును.

వేఁటకాఁడనంటా నా వెంటఁ బాయవు వోరి

చీటకపు చెంచెత నాచేతి లాగెరఁగవా ॥పల్లవి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: చీటకపు = (నీ) లీలల రీతుల, విధముల, అలవోకగా​; చెంచెత = A lady belonging to forest tribes,  శబరకాంత, ఇక్కడ మానవుని నీచమైన స్థితిని చూపుటకు వాడినారు; చీటకపు చెంచెత = సులభముగా అటునిటు వూగిసలాడు; లాగు = ఆకర్షణము, నాచేతి లాగెరఁగవా = నన్నుఆకర్షించుదానినేరుగవా

భావము: (ఈ పల్లవిలో మొదటి పంక్తి మానవుని మనోరథమును రెండవ పంక్తి ఆ అభిలాషకు సాటి రాని మానవుని ఆధమ స్థితిని చూపిస్తవి.) ఓ మానవుడా వేట కాడనంటూ పోటుగాడిలా నా (దైవము) వెంబడి వదలకుండా పరుగిడతావే! అతి చిన్నగాలి తాకిడికి అటు ఇటు కదలాడే హృదయము కల నీచమానవుడా నా చురుకుతనము నీకు తెలియనిదా?

చిక్కుల జిత్తుల మనస్సు: మనస్సును అదుపులో పెట్టుకోవడం యొక్క ఆవశ్యకతను గుర్తించిన అన్నమాచార్యులు ఈ అసమానమైన చూచాయపటమును మన మనస్సులలో నిలుపుటకు ప్రయత్నము చేసిరి. ఈ పల్లవి నిర్దిష్టంగా దేనినీ వర్ణించనప్పటికీ, వారు నైపుణ్యమైన పదజాలం ద్వారా మన దృష్టిని ఆకర్షించి, మనలో ఉత్సుకతను రేపి నిర్ణయింపరాని ఒక సమస్యాత్మకమైన కళాఖండాన్ని సృష్టించారు. ఈ పాట అన్నమాచార్యుల బహుముఖ ప్రజ్ఞకు గీటురాయి వంటిది.

అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః: ఈ పల్లవి ప్రధాన సందేశం మనస్సు కనికరం లేకుండా లెక్కలేనన్ని అడ్డంకులను  సృష్టించి దైవత్వాన్ని పొందాలనే మన తపనకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్లనే "చెంచెత" అనే పదాన్ని ఉపయోగించారు, ఇది తీవ్ర స్థాయిని ప్రతిఘటనకు సంకేతము.

నాచేతి లాగెరఁగవా" అన్నది పరిశీలిద్దాం. ఇది "నీ స్వంత మనసు చేసే వికృత చేష్టలను ప్రతిబింబాలను నీవే గ్రహించలేవా?" అని ప్రశ్నించడం లాంటిది. మనము ఏదైనా మనసు అను దర్పణములో ఆయా పదములను, అయా చేష్టలను ​ దర్శించుట ద్వారా గుర్తిస్తాం. ఈ ప్రపంచంలో మనం గుర్తించగల వస్తువులన్నీ క్షణికము. నీడల వంటివి అని అంటున్నారు. ఈ సందర్భంగా క్రితం చెప్పుకున్న క్రింది కీర్తనలు పరిశీలి పరిశీలించ తగినవి. "యేనుగఁ దలఁచిన నట్టే మానై పొడచూపు / మాను దలఁచిన నట్టే మానై పొడచూపు" ఇది సులభముగా అనిపించినా నీవేది తలస్తే అదే కనబడుతుంది అన్న విషయాన్ని కూడా చెప్పారు. అలాగే, “యీ యీ యీరీతి నా గుణము నాయందే తగిలెను” అనే పల్లవి మన ఆలోచనలే అంతర్యుద్ధం సృష్టించునది అని కూడా చెప్పారు.

తేలికగా తీసుకోకండి: ఈ ఉదాహరణల ద్వారా, 2-72లో చెప్పిన​ అత్యంత కఠినమైన విషయాన్ని తేలికగా తీసుకోకుండా తగినంత సమయం వెచ్చించి దానిని బాగుగా గ్రహించి చేపట్టిన మంచి గుణములు కనబడవచ్చు.

*సాంఖ్యయోగము సమాప్తము*

                                                                x-x-x-x 

సాంఖ్య యోగము. 2-70వ శ్లోకము

శ్లో|| ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ ||(2-70)|| 

టీక: - ఆపూర్యమాణమ్ = ఉదకములచే (నదీజలము మున్నగువానిచే సంపూర్ణముగ నింపబడినదియు); అచలప్రతిష్ఠమ్ = స్థిరమైనయునికిగలదియు (హద్దుమీరనిదియు) నగు; సముద్రమ్ =సముద్రమును, ఆపః = (నది మొదలగువాని) జలములు; యద్వత్ = ఏ రీతిగా; ప్రవిశన్తి = ప్రవేశించుచున్నవో; తద్వత్ = ఆ రీతిగనే; సర్వేకామాః = భోగ్యవిషయములన్నియు; యమ్ = ఏ మనుజుని ( బ్రహ్మనిష్ఠుని); ప్రవిశన్తి = ప్రవేశించుచున్నవో (ప్రవేశించి అణగిపోవుచున్నవో); సః = అట్టివాడు; శాన్తిమ్ = శాంతిని; అప్నోతి =పొందుచున్నాడు;. కామకామీ = విషయాసక్తి కలవాడు, న (ఆప్నోతి) = పొందడు.

తా:- ఏప్రకారముగా అనేక నదీజలములు మున్నగునవి  ప్రవేశించుచున్నప్పటికి సముద్రము సంపూర్ణముగాను నిశ్చలమైనదిగా తొణకకుండా వుండునో, ఆ ప్రకారమే భోగ్యవిషయములన్నియు ఏ బ్రహ్మనిష్ఠుని ప్రవేశించి (అతనిని వికృతము చేయలేక) అణగిపోవుచున్నవో ఆతడే శాంతిని పొందునుగాని విషయాసక్తి కలవారుకాదు.

వ్యాఖ్యానము:  

గంభీరమైన సముద్రము: సంకేతాత్మకమైన ఈ శ్లోకమును ఒక సింబాలిక్ పెయింటింగ్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము.

హిల్మా ఆఫ్ క్లింట్ రచించిన “Swan No 17 లేదా 17వ హంస​” అనే సింబాలిక్ పెయింటింగ్ (ప్రతీకాత్మక చిత్రము) ద్వారా ఈ చరణం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. మొదటి చూపులో, ఇది పిల్లల  పుస్తకాల్లో స్కెచ్'లలో రంగులు  పూరించినట్లు కనిపించవచ్చు. అయితే, ఇది 1.5 మీ ‍x 1.5 మీ పరిమాణము గల​ భారీ పెయింటింగ్ అని మీరు గమనించవచ్చు.



అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్: అర్థం చేసుకోవడానికి కష్టమైనది మరియు మౌఖికంగా చెప్పడానికి అనుకూలించని విషయాన్ని వ్యక్తీకరించడానికి ఆమె ఈ రేఖాచిత్రాలను కష్టపడి వేసింది. పైపైన విడిపోయినట్లు కనబడినప్పటికీ ఆ చిత్రము జీవితం యొక్క సంపూర్ణతను సూచిస్తుంది. క్రింది భగవద్గీత శ్లోకానికి అర్థం కూడా ఇదే: భగవద్గీత శ్లోకం అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ । భూతభర్తృ చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ 13-17 ॥ ఆయన విభజించుటకు వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే, సమస్త భూతములకు (ప్రాణులకు) సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము.

ప్రపంచమంతా ఒకటే: గొప్ప ప్రఖ్యాతి గడించిన భౌతిక శాస్త్రవేత్తలు డోనాల్డ్ హాఫ్మన్, క్వాంటమ్ భౌతిక శాస్త్రవేత్త ఎర్విన్ ష్రోడింగర్ "విశ్వంలోని మొత్తం మనస్సుల సంఖ్య ఒక్కటే" అని విశ్వసించారు. అంటే ఆ విశ్వజనీనమైన మనస్సు సమస్తమునకు కారణమవుతుంది.

సమగ్రమైన చర్య: మన అంతరంగంలో లోతుగా, మనకు కంటికి కనిపించే దానికంటే మనమే ఎక్కువ లేదా అధికులమనే అహంభావమును కలిగి ఉంటాము. ఈ స్వాభావిక భావము మానవజాతిని తరచుగా సమగ్రమైన చర్యను అర్థం చేసుకోకుండానే మార్పు కోసం ప్రయత్నించె దిశగా నడిపిస్తుంది. ఇటువంటి తప్పుదారి పట్టించే ప్రయత్నాల పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తాయి, అందరూ గమనించగలుగుతారు.



కుక్కతోక వంటి మానసిక భంగిమ​: ఈ పెయింటింగ్'లో హిల్మా అఫ్ క్లింట్ యొక్క ఉద్దేశ్యం చిత్రము మధ్యలో ఒక చిన్న త్రిభుజాన్ని ఉంచడం ద్వారా స్పష్టమవుతుంది, ఇది నిలువు అక్షం రెండు వైపులా సమనముగా వుంచబడింది. (పై బొమ్మని చూడండి). ఈ త్రిభుజంలోని రంగులు పెద్ద పటంలో కనిపించే రంగులకు విరుద్ధంగా ఉండటం గమనించవచ్చు. ఈ త్రిభుజం మానవాళి యొక్క వంగని, చెప్పినట్లు వినని మానసిక భంగిమను సూచిస్తుంది. ఇది హంస యొక్క అందమైన అద్భుతమైన  వంపుసొంపులకు ఆకర్షణియమైన రంగులకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. దీన్నిబట్టి, ప్రకృతితో సామరస్యంగా మమేకమై "ఒకే మనస్సు"తో ఐక్యతా స్థితిని సాధించడానికి మానవుడు మరింత సరళమైన, మృదువైన దృక్పథాన్ని పెంపొందించుకోవడం కీలకమని క్లింట్ సూచిస్తున్నారని మనం ఊహించవచ్చు.

"ఇదే నా కిటుకు: నాకు ఏం జరిగినా  అడ్డుపెట్టను" అన్న జిడ్డు కృష్ణమూర్తి మాటలతో దీన్ని పోల్చి చూద్దాం. దీనికి విరుద్ధంగా, మన మనస్సు తరచుగా ఏమి జరుగుతుందో ఆలోచిస్తుంది. ఆదుర్దా పడుతుంది. లేనిపోని చింతలకు గురియౌతుంది. ఈ రకంగా "ఏమి జరిగినా పట్టించుకోని మనస్సును" పె౦పొ౦ది౦చుకోవడ౦ ఎ౦త ముఖ్యమో అర్థ౦ చేసుకోవచ్చును. ఇది వ్యక్తిగత దృక్పథానికి సంబంధించిన విషయం అయినప్పటికీ, ఐతే ఏది” “దేనిలోమార్పు తేవలెననునది అతి పెద్ద సమస్య​. ఇదే భావన భగవద్గీతలోని ఒక శ్లోకంలో కూడా వ్యక్తమవుతుంది. న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన(6-2) భావము కేవలం దృఢ సంకల్పం మీద ఆధారపడటం ద్వారా ఒక వ్యక్తి నిజంగా యోగి కాలేడు అనేది శ్లోకం యొక్క తాత్పర్యము.

 

తేజోమార్గము: ఉపరితల స్థాయి మార్పులకు అతీతంగా నిజమైన పరివర్తన లోతైన స్థాయిలో జరగాలని సూచిస్తూ, త్రిభుజాన్ని కేంద్రంలో ఉంచడం ద్వారా ఆఫ్ క్లింట్ మరొక ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. ఇదే భావన అన్నమాచార్యుని 'భావింప నరుదైన బంధ మేమిట మాను' అను మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. ఐతే రూపాంతరం అనేది ఒక వివిక్త (ఏకాంత) ప్రక్రియ కాదని, విశ్వజనీన మేధస్సుతో విలీనం కావడానికి వ్యక్తిగత ఆత్మ  అనే భావన అడ్డుపడుతుందని ఇద్దరు కళాకారులు వ్యక్తపరుస్తారు. విచిత్రమేమో కానీ తరతరాలుగా ఈ లోతైన భావన మానవాళిలో ఆసక్తిని రేకెత్తిస్తూనే వుంది. బహు కొద్దిమంది మాత్రమే ఇందలి సవాళ్ళను పూర్తిగా స్వీకరించి తేజోమార్గమున పయనించ గలిగారు.

x-x-x-x-x