ఈరోజున విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు వేగంగా మనిషికి మునుపెన్నడూ లేని సౌకర్యాల్ని కల్పిస్తున్నాయి. అయినా మనుషులు ప్రపంచంలో ఎక్కడా సుఖంగా, శాంతిగా మనగలగడం లేదు. ఏరోజు పేపర్లో ముఖ్య వార్తలు చదివినా ఈ విషయం తెలుస్తుంది. వాస్తవానికి అనేకానేక కార్యక్రమాలలో మునిగి, ఎటుపోవుటయో నిర్ణయింప లేకున్నారు.
2. కొందరు తమ వద్ద అపరిమిత ధనము లేదా శక్తి ఉంటే సుఖంగా ఉంటాము అనుకుంటారు. అన్ని మత గ్రంథాలు, ఎందరో మహానుభావులు, చివరకు మన సినిమాలు కూడా ఇది నిజం కాదని ప్రతీసారీ నిరూపిస్తాయి. ఐనా ఈ ప్రపంచంలో ఇదే (ధనము లేదా శక్తి సంపాదించడం) సరైనదని నమ్మేవారు కోకొల్లలు.
3. నేను వేరు ప్రపంచం వేరు అనే భావన మనందరిలోనూ బలంగా ఉంటుంది. ఈ భావమే ప్రస్తుత ప్రపంచంలోని సర్వ కార్యకలాపాలకు కేంద్రం!!! ఈరోజున మీకు గోళ్ళు కత్తిరించడం నుంచి దైవాన్ని చూపించే వరకు రకరకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అందమైన రంగులద్ది మనసుకు ఆకట్టుకునే రీతిలో మన ముందుకు తీసుకొస్తారు. ఐతే, ఈ చర్యలన్నీ, సూక్ష్మంగా చెప్పాలంటే కూటి కోసం కోటి విద్యలు అనుకోవచ్చును. కాబట్టి, అటువంటి దుకాణాలలో మీకు కావల్సింది దొరుకుతుందనుకోవడం అవివేకమే!! ఎందుకంటే వాటి వెనుక పడడం ఎండమావుల్లో నీరు వెతకడం లాంటిదే!!.
4. ప్రపంచంలో పరస్పరం విరుద్ధమైన మంచి, చెడులు ఎందుకు ఉన్నాయనిపిస్తుంది? ఎందుకంటే మనం మంచినో లేదా చెడునో పట్టుకొని ఉండటం మూలాన రెండోది కనబడుతోంది. మనం పట్టుకుని ఉన్న దాన్ని వదిలేస్తే ఏమవుతుంది? భగవద్గీత చదివితే కొన్ని సమాధానాలు దొరకవచ్చు!
5. భగవద్గీత దేని గురించి చెప్తుంది?
దేవుళ్ల గురించా?
హిందూ మత సంప్రదాయాల గురించా?
హిందువులు చేయవలసిన విధి విధానాల గురించా?
ఆచారాలు, వ్యవహారాలు గురించా?
హిందువులు చేయవలసిన ప్రచారం గురించా?
వీటిలో ఏవొక్కటి నిజం కాదు!!
6. భగవద్గీత ముక్కుమూసుకుని తపస్సు చేయమని చెప్తోందా? దైవ ప్రార్ధన నెపంతో అజ్ఞానంలో ఉండిపొమ్మని చెబుతోందా? కళ్ళు తెరుచుకుని, ప్రపంచాన్ని అర్ధం చేసుకుని, సమ దృష్టితో చూడమని చెప్తోందా?
7. చాలామంది భగవద్గీత ఒక హిందూ మత గ్రంధం అనే ముద్ర వేసి తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు. నిజానికి భగవద్గీత ఒక మత గ్రంథమే కాదు. అది చాలా వరకు మనో విశ్లేషణ గ్రంథము అనడమే ఉచితం.
8. మనం రెండవ తరగతి (పరోక్ష) జ్ఞానముతో సంతృప్తి చెందుతాం. ఫలానా స్టార్ చెప్పిన ఐస్ క్రీం, రోల్ మోడల్ ప్రకటించే దుస్తులు వగైరా వగైరాలు మనలోని నేనును నిర్ణయిస్తున్నాయి. మనకంటూ స్వంత అభిప్రాయాలు ఉన్నా, వాటిని జాగ్రత్తగా గమనిస్తే కృత్రిమ/పరోక్ష (cultured) భావాలు లేదా జనరంజనమైన భావాల మారు రూపాంతరము అని తెలుస్తుంది. ముందుగా, ఈ రెండవ తరగతి ( పరోక్ష) జ్ఞానమును వదిలి వేయవలెను అని భగవద్గీత నొక్కి చెప్పింది.
9. అయితే ఇవి వదిలేస్తే నిజంగా దేవుడు కనబడతాడా? ఈ ప్రశ్న అడిగాము అంటే మన ఇంకా పరోక్ష జ్ఞానంలో ఉన్నట్లే. ఇదే ముందుగా తెలుసుకోవలసిన విషయం. మనిషి ఏదో ఒక దానిని ఆసరాగా పట్టుకుని అస్తిత్వము నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. భగవద్గీత ఆ ఆసరా నీకు నీవే అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. భగవద్గీత నీ కళ్ళతో నీవే, నీకు తెలిసిన సర్వమూ వదిలి సత్యాన్వేషణ చేయమని ఉద్భోదిస్తోంది. ఇది ఒక నిరంతర వ్యవసాయము. మనిషి స్వయంగా, ఒక్కడే, ఏకాకిగా పయనించ వలసిన మార్గము అని సూచన.
10. ఒకే ఒక్క శ్లోకంలో భగవద్గీత సారాంశం ఇరికించి చెప్పారు.
శ్రీభగవానువాచ:
శ్లో|| ఉద్ధరేదాత్మనాత్మానం
నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః
ఆత్మైవ రిపురాత్మనః ।। (6-5)
భావం : అర్జునా!! నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమై పోవద్దు. ఎందుకంటే (ఉపయోగించడం బట్టి) మనస్సే నీ మిత్రుడు లేదా శత్రువు అవ్వచ్చు .
ఒక రకంగా చెప్పాలంటే, భగవద్గీత కేవలం మార్గం నిర్దేశిస్తుంది. నువ్విలా చేయాలని చెప్పదు.
11. ఈ విశ్వంలో ప్రతీ మనిషి ప్రత్యేకమే. అతని ఆలోచనలు మిగిలిన వారందరి కన్నా వేరుగా ఉంటాయి. అతని ఆలోచనలకు అతని ఆత్మే సాక్షి. అందుకనే, ప్రపంచంలో అందరికీ కలిపి ఒకే (ముక్తి) మార్గము నిర్దేశించుట అసాధ్యం. అందుకే భగవద్గీతలో ఆ మార్గమును వెతుకుట సాధకునికే వదిలివైచి _*తతః పదం తత్పరిమార్గితవ్యం*_ 15-4 (ఏ మార్గంలో పయనించిన ఈ జగత్తు లోనికి తిరిగి రామో, ఆ మార్గమును సాధకుడు వెతకవలెను) అన్నారు. ఒక సంప్రదాయ గ్రంథంలో ఈ రకమైన ఉదార మరియు నిష్కపట నిర్దేశం (directive) చాలా గొప్ప విషయం. ఆస్కార్ అవార్డులు అధిక శాతం open ended చిత్రాలకి ఇచ్చినట్లు, ఈ శ్లోకం భగవద్గీతకే తలమానికం. అంతే కాక, ఈ శ్లోకం భగవద్గీత ఒక విప్లవాత్మక గ్రంథం అని కూడా నిరూపిస్తుంది.
వీటిల్లో ఏ ఒక్కటేనా మీ హృదయాన్ని తాకితే, ఈ భగవద్గీత బ్లాగ్ ఉద్దేశ్యం సఫలమైనట్లే!