24, మార్చి 2024, ఆదివారం

1.0 అర్జున విషాద యోగం - ఒక పరిచయం

for English version please press here


బాధలను అణచివేయడం లేదా తప్పించుకుని తిరగడము ద్వారా నిజమైన విముక్తి లభించదు, కానీ బాధలను పూర్తిగా అనుభవించడం ద్వారా మాత్రమే వస్తుంది. 

విశ్వవిఖ్యాత మనోతత్వవేత్త

కార్ల్ గుస్టావ్ జంగ్

 

వేద వ్యాస మహర్షులవారు ఈ భగవద్గీతను అర్జున విషాద యోగంతో ఎందుకు ప్రారంభించారో అలోచింతము. సాధారణంగా మానవులు చాలా గర్వంగా ఉంటారు. మనం సహజంగా ఇతరుల మాట వినం. మనకు అన్ని మార్గాలు మూసుకుపోయాయి, గత్యంతరం లేదు అనిపించినప్పుడు మాత్రమే ఇతరుల మాటలు వినే అవకాశం వుండవచ్చును. ఆపదలలో ఉన్నవారికి ఇది సహజంగానే అబ్బుతుంది.

రాజరికం నిండుగా ఒలుకుతున్న అర్జునునిది విలువిద్యలో అందరికీ పైచేయి. అటువంటి యోధులు కృష్ణుడు ఇవ్వబోయే (రణమునకు సంబంధించని) గొప్ప సలహాలను వంటపట్టించుకోలేరు. జీర్ణించుకోలేరు. అట్టివారికి తగిన సలహా ఇచ్చే ముందు వారిని ఆ మానసిక స్థితికి తీసుకురావాలి.  వారిని ముందుగా మోకాళ్ళ బేరానికి తేవాలి.

అర్జునుడు రథం కురుక్షేత్రంలోకి ప్రవేశించగానే ఎవరితో పోరాడాలో చూడాలని అనుకున్నాడు. తన ప్రత్యర్థులు, ఎందరో గొప్ప యోధులు, అందరూ తన సమీప బంధువులే కావడం చూసి అర్జునునికి ఎంతో దుఃఖం కలుగుతుంది.  అతడు యుద్ధం మరియు దాని పర్యవసానాల గురించి ఊహించడం ప్రారంభిస్తాడు. జరగబోయే విధ్వంసాన్ని తట్టుకోలేక, అర్జునుని చెంపల మీద కన్నీళ్లు రాలుతున్నాయి.

మన ప్రస్తుత మానసిక స్థితులు మార్పును వ్యతిరేకించుతాయి.  ఇప్పుడున్న ఆనందం కోలుపోతాననే ఆధారములేని సందిగ్ధము, లేని బాధలు ముంచుకొస్తాయనే ఉద్వేగము ఈ వ్యతిరేకతల నుండే అనుభవములోనికి వస్తాయి. మొదటి అధ్యాయములోని చాలా భాగం దీనికే అంకితం చేయబడింది. మనము ఆ వివరాలలోకి వెళ్ళడం లేదు.

భగవద్గీత మొత్తంలో అర్జునుడు (రాకుమారుడైనా, విలువిద్యా నైపుణ్యమున్నప్పటికీ) సామాన్యుడికి, అతని అభిరుచులకు ప్రాతినిధ్యం వహిస్తాడు.